చిన్న సూదికే భయపడతా.. నన్ను ట్రోల్ చేయడం అన్యాయం: పాయల్ ఆవేదన
తాను కొవిడ్-19 టెస్ట్ చేయించుకుంటున్న వీడియోను శనివారం సోషల్ మీడియాలో పెట్టడంతో ఆమెను నెటిజన్లు విపరీతంగా ట్రోల్ చేశారు. ఆరు నెలల తరవాత తిరిగి షూటింగ్లో పాల్గొన్న పాయల్.. సెట్స్లోకి వెళ్లడానికి ముందు తప్పనిసరి అయిన కరోనా టెస్ట్ చేయించుకున్నారు. అయితే, పాయల్ సోషల్ మీడియాలో షేర్ చేసిన వీడియోలో ఆమె టెస్ట్ చేయించుకోవడానికి భయపడిపోతూ ఏడ్చేశారు. పాయల్ ఆ వీడియోను సోషల్ మీడియాలో పెట్టిన కొన్ని నిమిషాల్లోనే ఆమెపై ట్రోలింగ్ మొదలైపోయింది. పాయల్ ఓవరాక్టింగ్ చేస్తున్నారని, మరీ అంత అవసరమా అని కామెంట్లు పెట్టారు. అయితే, నెటిజన్లు తనను ట్రోల్ చేయడంపై పాయల్ స్పందించారు. తాను నిజంగానే భయపడ్డానని, నటించాల్సిన అవసరం తనకు లేదని తనను ట్రోల్ చేసిన వారికి గట్టిగానే సమాధానం చెప్పారు పాయల్. ఈ మేరకు ఆమె ‘హైదరాబాద్ టైమ్స్’తో మాట్లాడారు. ‘‘నాకు సూదులంటేనే భయం. మందులన్నా, ఇంజక్షన్ అన్నా ఆమడ దూరం పారిపోతా. అందుకే, కొవిడ్-19 కోసం చేసిన స్వాబ్ టెస్ట్ నాకు చాలా ఇబ్బందికరంగా అనిపించింది. ఈ మాత్రం దానికి నన్ను ట్రోల్ చేయడం అన్యాయం, దారుణం’’ అని పాయల్ వెల్లడించారు. పాయల్ రాజ్పుత్ శుక్రవారం నుంచి రామోజీ ఫిల్మ్ సిటీలో షూటింగ్లో పాల్గొంటున్నారు. కొవిడ్ -19 నిబంధనలను పాటిస్తూ ఆమె షూటింగ్ చేస్తున్నారు. కొవిడ్-19 టెస్ట్ చేయించుకోకుండానే షూటింగ్లో పాల్గొనాలని ప్రయత్నించానని.. కానీ కుదరలేదని పాయల్ తెలిపారు. ‘‘మొత్తం యూనిట్కు టెస్టులు నిర్వహించడానికి ముగ్గురు డాక్టర్లను పిలిపించారు. నేను చాలా భయపడటంతో నాకు ఆఖరిగా టెస్ట్ చేశారు. నేను బాగానే ఉన్నానని, నాకు టెస్ట్ అవసరం లేదని వాళ్లకు చెబుతూనే ఉన్నాను. కానీ, సెట్స్లో ఉన్న వాళ్లందరి భద్రత ముఖ్యమని తరవాత నాకే అనిపించింది. నా భయానికి మొత్తం యూనిట్ను బలి చేయకూడదని భావించి టెస్ట్ చేయించుకున్నాను’’ అని పాయల్ వెల్లడించారు. Also Read:
Comments
Post a Comment