నన్నే ఎవరూ పిలవలేదు.. నేను బాలయ్యను పిలవాలా: సి.కళ్యాణ్కు నరేష్ కౌంటర్
తెలుగు సినీ పరిశ్రమ పెద్దలు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్తో చర్చలు జరపడంపై నటుడు నందమూరి సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ప్రభుత్వంతో ఏం చర్చలు జరుగుతున్నాయో తనకు తెలీదని, అసలు ఆ చర్చలకు తనను ఎవరు పిలిచారని బాలయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో బాలకృష్ణ వ్యాఖ్యలు ఇండస్ట్రీలో హాట్ టాపిక్గా మారాయి. బాలకృష్ణ వ్యాఖ్యలపై ఇప్పటికే నిర్మాత సి.కళ్యాణ్, మెగా బ్రదర్ నాగబాబు స్పందించారు. తన వ్యాఖ్యలపై బాలయ్య క్షమాపణలు చెప్పాలని నాగబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. Also Read: ఇండస్ట్రీలో ఎవరినీ ఎవరూ ఈ చర్చలకు పిలవలేదని, ఎవరికి వారు తమ సమస్యలు ప్రభుత్వానికి చెప్పుకోవడానికి ముందుకు వచ్చారని సి.కళ్యాణ్ అన్నారు. బాలకృష్ణ వస్తే ఎవరూ కాదనరని కూడా అన్నారు. అంతేకాకుండా, చిరంజీవి నివాసంలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సారథ్యంలో జరిగిన సమావేశానికి, ముఖ్యమంత్రి కేసీఆర్తో జరిగిన భేటీకి బాలకృష్ణను పిలుచుకోవాల్సిన బాధ్యత మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్(మా)దేనని సి.కళ్యాణ్ చెప్పినట్టు ఓ వెబ్సైట్ రాసింది. అయితే, సి.కళ్యాణ్ వ్యాఖ్యలపై ‘మా’ అధ్యక్షుడు వీకే నరేష్ స్పందించారు. సి.కళ్యాణ్ వ్యాఖ్యలు తనను షాక్కు గురిచేశాయని అన్నారు. ఈ మేరకు ఆ వెబ్సైట్లో ప్రచురించిన వార్తను స్క్రీన్ షాట్ తీసి నరేష్ ట్వీట్ చేశారు. Also Read: ‘‘సీఎం గారు, చిరంజీవి గారితో సమావేశాలకు బాలకృష్ణ గారిని ఆహ్వానించాల్సిన బాధ్యత ‘మా’ది అని సి.కళ్యాణ్ గారు ఇచ్చిన స్టేట్మెంట్ చూసి నేను షాక్కు గురయ్యాను. ఒక ‘మా’ ప్రెసిడెంట్గా నన్ను కానీ, మా జనరల్ సెక్రటరీని కానీ ఏ సమావేశాలకు పిలవలేదు. అలాంటిది, ఈ మీటింగ్లకు వేరొకరిని ఎలా ఆహ్వానించగలను’’ అని ట్వీట్లో నరేష్ ప్రశ్నించారు. అయితే, కారణం ఏమిటో తెలీదు కానీ ఈ ట్వీట్ను కాసేపటికే నరేష్ డిలీట్ చేశారు.
Comments
Post a Comment