మనుషులు ఇంకా మారలేదా అనిపిస్తోంది.. మోహన్ బాబు సంచలన వ్యాఖ్యలు
ఏదైనా ముక్కుసూటిగా మాట్లాడటం, మనసులో ఉన్నది బయటపెట్టేయడం విలక్షణ నటుడు మంచు నైజం. అందుకే ఆయన మాట్లాడిన మాటలు కొన్ని సందర్భాల్లో వివాదాలకు కారణంగా మారుతుంటాయి. అయినప్పటికీ తాను చెప్పాలనుకున్నది నిర్మొహమాటంగా చెబుతుంటారు ఈ డైలాగ్ కింగ్. ఈ క్రమంలోనే కరోనా కల్లోలం సృష్టిస్తున్న ఈ లాక్డౌన్ సమయంలో ప్రజలు వ్యవహరిస్తున్న తీరు, పోలీసు చర్యల గురించి మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు మోహన్ బాబు. కరోనా మహమ్మారిని కట్టడి చేయడంలో భాగంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లాక్డౌన్ ఆదేశాలు జారీ చేశాయి. ప్రజలు ఎవ్వరూ బయటకు రాకుండా పకడ్బందీ చర్యలు తీసుకుంటూ కరోనా బాధితులకు వైద్యసహకారం అందిస్తున్నాయి. పోలీసులు, డాక్టర్లు, పారిశుధ్య కార్మికులు ప్రతీ క్షణం శ్రమిస్తూ కరోనా కళ్లెం వేస్తున్నారు. అయితే కొన్ని ఏరియాల్లోని ప్రజలు ఏదో ఒక సాకుతో పోలీసులు, డాక్టర్లు చేస్తున్న కృషికి అడ్డుపడుతూ రోడ్లపై విచ్చలవిడిగా తిరుగుతున్నారు. డాక్టర్లపై చేయి చేసుకుంటున్నారు. తాజాగా ఇలాంటి ఇష్యూలపై స్పందించిన మోహన్ బాబు ప్రజలకు కాస్త ఘాటుగానే మాట్లాడారు. ''మనం దైవాలుగా భావించవల్సిన డాక్టర్లపై, నర్సులపై అక్కడక్కడా కొందరు దాడి చేయడం చూస్తుంటే మనుషులు ఇంకా మారలేదా అనిపిస్తోంది. వైద్యో నారాయణో హరి అన్నమాటను వేదవాక్కుగా భావించాలి. పోలీసులు మన రక్షణ కోసం వాళ్ళ రక్షణను వదిలేసి లాఠీ ఎత్తేది మన మీదకాదు.. కరోనా వైరస్ మనమీద పాకకుండా ఉండటం కోసమని గుర్తించండి. పోలీసులను, డాక్టర్లను గౌరవించండి. అన్నదమ్ముల కలిసి మెలసి ఉండండి. ఆ భగవంతున్ని ప్రార్థిస్తూ ప్రపంచం మొత్తం ఆరోగ్యంగా ఉండాలని కోరుకోండి'' అని మోహన్ బాబు అన్నారు. Also Read:
Comments
Post a Comment