పునీత్ రాజ్కుమార్కి చిరంజీవి, వెంకటేశ్ నివాళి... కంఠీరవ స్టేడియాని ధృతి రాజ్కుమార్.. అంత్యక్రియలు వాయిదా!
కన్నడ హీరో పునీత్ రాజ్కుమార్ గుండెపోటుతో శుక్రవారం మరణించిన సంగతి తెలిసిందే. ఆయన మరణవార్తను అభిమానులు ఎవరూ జీర్ణించుకోలేకపోతున్నారు. ఇక ఆయనతో అనుబంధం ఉన్న సినీ సెలబ్రిటీల సంగతి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సోషల్ మీడియా ద్వారా సంతాపాన్ని ప్రకటించిన మన టాలీవుడ్ హీరోలు చిరంజీవి, వెంకటేశ్, శ్రీకాంత్, అలీ శనివారం రోజున బెంగుళూరు చేరుకుని పునీత్ రాజ్కుమార్ పార్థీవ దేహానికి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మీడియాతో కూడా మాట్లాడారు. ‘‘జీర్ణించుకోలేని విషయం. పునీత్ను మనకు దూరం చేసి ఆ దేవుడు చాలా అన్యాయం చేశాడు. ఎంతో బాధగా ఉంది. ఎప్పుడూ బెంగుళూరు వచ్చిన రాజ్కుమార్గారి కుటుంబాన్ని కలిసేవాడిని. రాజ్కుమార్గారైతే వారి పిల్లలందరితో నన్ను కలిపించేవారు. తర్వాత శివ, పునీత్లతో మా బంధం కొనసాగింది. ఈరోజు పునీత్ మరణంపై ఇంత మంది దుఃఖాన్ని వెలిబుచ్చుతున్నారంటే ఆయనెంత గొప్ప వ్యక్తో అర్థం చేసుకోవచ్చు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నాను’’ అని చిరంజీవి అన్నారు. ‘‘పునీత్ వంటి మంచి వ్యక్తిని ఇండస్ట్రీ కోల్పోవడం చాలా దురదృష్టకరం’’ అన్నారు వెంకటేశ్. ‘‘పునీత్ది చాలా మంచి మనసు. డౌన్ టు ఎర్త్ పర్సన్. పెద్దలంటే ఎనలేని గౌరవం ఇస్తాడు. ఆదేవుడు ఆయన ఆత్మకు శాంతిని కలగించాలని కోరుకుటున్నాను’’ అన్నారు హీరో శ్రీకాంత్. వీరితో పాటు అలీ కూడా కలిసి నివాళులు అర్పించారు. మరో వైపు పునీత్ రాజ్కుమార్ పెద్ద కుమార్తె ధృతి రాజ్కుమార్ బెంగుళూరు చేరుకున్నారు. అక్కడి నుంచి కంఠీరవ స్టేడియాని చేరుకున్నారు. ధృతి రాజ్కుమార్ రాక ఆలస్యం కావడంతో పునీత్ రాజ్కుమార్ అంత్యక్రియలను ఆదివారానికి వాయిదా వేశారు. ఇప్పటికే నందమూరి బాలకృష్ణ, ఎన్టీఆర్, రానా దగ్గుబాటి, ప్రభుదేవా, నరేశ్ సహా పలువురు పునీత్ రాజ్కుమార్ పార్థీవ దేహానికి నివాళులు అర్పించారు.
Comments
Post a Comment