‘నారప్ప’కు ఒక్కరోజు ముందొస్తున్న ‘ఆచార్య’

‘ఆచార్య దేవో భవ’ అని మన అందరికీ తెలిసిందే.. కానీ ‘ఆచార్య రక్షోభవ’ అని అంటున్నారు మెగాస్టార్ చిరంజీవి. అసలు ‘ఆచార్య’ గురించి అంత బలంగా ఎందుకు చెబుతున్నారు అనే విషయం తెలియాలంటే సినిమా చూడాల్సిందేనని అంటోంది చిత్ర యూనిట్. మెగాస్టార్ టైటిల్ పాత్రలో నటిస్తోన్న చిత్రం ‘ఆచార్య’. స్టార్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ చిత్రాన్ని శ్రీమతి సురేఖ కొణిదెల సమర్పణలో కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ, మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్ పతాకాలపై నిరంజన్ రెడ్డి, రామ్ చరణ్ నిర్మిస్తున్నారు. ‘ఆచార్య’ టీజర్ను కొణిదెల అంజనా దేవి పుట్టినరోజు సందర్భంగా శుక్రవారం విడుదల చేశారు. టీజర్కు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ వాయిస్ ఓవర్ అందించారు. ఈ సినిమాలో సిద్ధ అనే మరో పవర్ఫుల్ పాత్రలో రామ్ చరణ్ నటిస్తున్నారు. వీరిద్దరూ కలిసి నటిస్తుండటంతో సినిమా ఎలా ఉంటుందోనని అందరిలో ఆసక్తి పెరిగింది. మొత్తానికి ఈ సినిమా ప్రేక్షకులకు ముందుకు ఎప్పుడొస్తుందో తెలిసిపోయింది. టీజర్ను విడుదల చేసిన గంటన్నర సమయంలోనే ‘ఆచార్య’ విడుదల తేదీని ప్రకటించారు. మే 13న ‘ఆచార్య’ సినిమాను విడదల చేస్తున్నట్టు నిర్మాతలు ప్రకటించారు. ఈ మేరకు కొత్త పోస్టర్ను విడుదల చేశారు. కాగా, ‘ఆచార్య’ విడుదలైన ఒక్కరోజు తరవాత అంటే మే 14న విక్టరీ వెంకటేష్ ‘నారప్ప’ విడుదలవుతోంది. ప్రస్తుతం ‘ఆచార్య’ సినిమా చిత్రీకరణ దశలో ఉంది. ఈ సినిమా కోసం హైదరాబాద్ శివారు ప్రాంతమైన కోకాపేటలో వేసిన భారీ టెంపుల్ సెట్ను టీజర్లో మనం చూడొచ్చు. ఇండియాలో అతి పెద్ద టెంపుల్ సిటీ సెట్ ఇది.
Comments
Post a Comment