నేను నిక్షేపంగా ఉన్నాను.. ఆ వార్తలు బాధించాయి: నటి ఆమని ఆవేదన
రెండు రోజుల క్రితం తెలంగాణలోని మంచిర్యాలలో ఓ సినిమా షూటింగ్లో పాల్గొన్న సీనియర్ నటి స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. స్థానికంగా ఉన్న ఓ ప్రైవేట్ హాస్పిటల్కు వెళ్లి వైద్యం తీసుకున్నారు. అక్కడి మెడికల్ స్టాఫ్ కోరిక మేరకు వాళ్లతో ఒక ఫొటో కూడా దిగారు. ఈ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఆమనికి అస్వస్థత అనే వార్త క్షణాల్లో వ్యాపించేసింది. డిజిటల్ మీడియాలో ఈ వార్త హైలైట్ అయ్యింది. కొంత మంది అత్యుత్సాహంతో ఆమని గుండె పోటు అని రాసేశారు. అయితే, ఈ వార్తలపై నటి ఆమని స్పందించారు. ఇలాంటి వదంతులు ఎందుకు పుడతాయో అర్థం కావడం లేదు అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. తాను నిక్షేపంగా ఉన్నానని.. దయచేసి వదంతులు వ్యాప్తి చేయవద్దని కోరారు. ఈ మేరకు ఆదివారం ఆమె మీడియాలో మాట్లాడారు. ‘‘నేను నిక్షేపంగా షూటింగ్స్తో బిజీగా ఉన్నాను. ఫుడ్ పాయిజన్ వల్ల కొంచెం అస్వస్థతగా అనిపించడంతో యూనిట్ బలవంతం మీద ఆసుపత్రికి వెళ్లాను. దీన్ని హార్ట్ ఎటాక్గా చిత్రీకరించడం చాలా బాధాకరం’’ అని ఆమని ఆవేదన వ్యక్తం చేశారు. కాగా, మంచిర్యాల జిల్లాకు చెందిన గేయ రచయిత తైదల బాపు నిర్మాతగా వ్యవహరిస్తున్న ఓ చిత్రంలో ఆమని నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ నిమిత్తమే ఆమె మంచిర్యాల వెళ్లారు. మరోవైపు, ఆమని ముఖ్యపాత్ర పోషించిన ‘అమ్మ దీవెన’ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రస్తుతం ఆమని నటిస్తున్న ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్లర్’, ‘చావు కబురు చల్లగా’తో పాటు పలు చిత్రాలు వివిధ దశల్లో ఉన్నాయి.
Comments
Post a Comment