కరోనా ఎఫెక్ట్: WHO ఆన్లైన్ కోర్స్లో చేరిన డైరెక్టర్ తేజ
కరోనా వైరస్ కారణంగా ప్రపంచం మొత్తం స్తంభించిపోయింది. ఈ మహమ్మారిని చూసి చాలా దేశాలు వణికిపోతున్నాయి. ఈ వైరస్ను అరికట్టడానికి లాక్డౌన్ ఒక్కటే మార్గమని ఎన్నో దేశాలు దీన్ని పాటిస్తున్నాయి. మన దేశంలోనూ 30 రోజులుగా పైగా ఈ లాక్డౌన్ కొనసాగుతోంది. అయితే, ఈ కరోనా డైరెక్టర్ తేజలో ఒక కొత్త ఆలోచనను పుట్టించింది. అదే WHO ఆన్లైన్ కోర్స్. శ్వాసకోశపై ప్రభావం చూపించే కరోనా లాంటి వైరస్లు భవిష్యత్తులో వస్తే వాటిని ఎలా ఎదుర్కోవాలో ఈ కోర్స్ ద్వారా తేజ నేర్చుకుంటున్నారు. ఈ కోర్సులో భాగంగా అంటువ్యాధులు, వేగంగా ప్రమాదానికి గురయ్యే శరీర భాగాలు వాటి గురించి తేజ తెలుసుకుంటున్నారు. ఈ కోర్స్ పూర్తయిన తరవాత తేజ ఆన్లైన్ టెస్ట్ కూడా రాయాల్సి ఉంటుందట. ఈ టెస్ట్లో పాసయితే WHO వాలంటీర్గా పనిచేసే అవకాశం కూడా కల్పిస్తారు. ఈ కోర్సు నేర్చుకుని అంటు వ్యాధులు, శ్వాసకోశ సంబంధిత వ్యాధులపై తన చుట్టూ ఉన్న వాళ్లకు తేజ అవగాహన కల్పించనున్నారు. లాక్డౌన్ కారణంగా చిత్ర పరిశ్రమలో ఉపాధి కోల్పోయిన రోజువారీ వేతన కార్మికులను ఆదుకోవడానికి ఇండస్ట్రీ పెద్దలు ఎంతో చేస్తు్న్నారు. అలాగే, తనవంతుగా ఈ వ్యాధులపై వారికి అవగాహన కల్పించాలని తేజ చూస్తున్నారట. Also Read: ఇక తేజ సినిమాల విషయానికి వస్తే.. కిందటేడాది ఆయన ‘సీత’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. కాజల్ అగర్వాల్, బెల్లంకొండ శ్రీనివాస్ హీరోహీరోయిన్లుగా నటించిన ఈ చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. ఆ సినిమా తరవాత మరే ప్రాజెక్ట్ను తేజ ప్రకటించలేదు. రామ్ గోపాల్ వర్మ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్గా, పలు హిందీ సినిమాలకు సినిమాటోగ్రాఫర్గా పనిచేసిన తేజ.. 20 ఏళ్ల క్రితం ‘చిత్రం’ సినిమా ద్వారా టాలీవుడ్కు డైరెక్టర్గా పరిచయమయ్యారు. తొలి సినిమాతో గుర్తింపు తెచ్చుకున్నారు. ‘నువ్వు నేను’, ‘జయం’ సినిమాలతో తేజ పేరు మారుమోగింది. అయితే, ఆ తరవాత తేజకు చెప్పుకోదగిన విజయం దక్కలేదు. వరసపెట్టి సినిమాలు చేసినా కలిసిరాలేదు. 2017లో ‘నేనే రాజు నేనే మంత్రి’ సినిమాతో తేజ మళ్లీ ఫామ్లోకి వచ్చారు.
Comments
Post a Comment