‘మహానుభావుడు’గా మారండి: శర్వానంద్ ‘ఓసీడీ’ టిప్స్
శర్వానంద్ హీరోగా మూడేళ్ల క్రితం ‘మహానుభావుడు’ అనే సినిమా వచ్చింది. మారుతి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో శర్వానంద్ ఓసీడీతో బాధపడే వ్యక్తిగా నటించారు. ఓసీడీ ఫుల్ ఫాం ‘అబ్సెషన్ కంపల్షన్ డిసీజ్’. ఓసీడీ ఉన్నవాళ్లు కడిగిన చేతులే కడుగుతుంటారు.. వేసిన తాళాలు మళ్లీ మళ్లీ చెక్ చేస్తుంటారు.. కట్టేసిన గ్యాస్ సిలెండర్ను మాటిమాటికీ చూస్తుంటారు.. అంతేకాదు, ఎదుటివాళ్లు కూడా శుభ్రంగా ఉన్నారా లేదా అనే అనుమానంతో సతమతమవుతూ ఉంటారు. ‘మహానుభావుడు’ సినిమాలో శర్వానంద్ కూడా అతి జాగ్రత్తలు పాటిస్తూ ఉంటారు. శానిటైజర్ జేబులో పెట్టుకుని తిరుగుతుంటారు. ఇప్పుడు మనందరినీ అలాగే ఉండమంటున్నారు శర్వానంద్. శర్వానంద్ నిన్నటి వరకు ట్విట్టర్లో లేరు. అయితే, ప్రస్తుతం ఉన్న క్లిష్ట పరిస్థితుల్లో ట్విట్టర్ ద్వారా తన అభిమానులతో పాటు ప్రజలతో టచ్లో ఉండాలని నిర్ణయించకుని ఆదివారం అకౌంట్ ఓపెన్ చేశారు. ఉదయం 11 గంటలకు తొలి ట్వీట్ చేశారు. దినసరి వేతనంతో పనిచేసే కార్మికులు సినిమా సెట్లపై అందరికంటే ఎక్కువగా కష్టపడుతుంటారని ట్వీట్లో పేర్కొన్న ఆయన.. షూటింగ్లు లేక ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న తెలుగు సినీ కార్మికుల సంక్షేమం కోసం ఏర్పాటు చేసిన కరోనా క్రైసిస్ ఛారిటీకి రూ. 15 లక్షలు విరాళం ప్రకటించారు. కరోనా వైరస్ వ్యాప్తి ఉధృతంగా ఉన్న నేపథ్యంలో ప్రభుత్వం విధించిన లాక్డౌన్ను తప్పనిసరిగా పాటిస్తూ, అందరూ తమ ఇళ్లల్లోనే సురక్షితంగా ఉండాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వాలు, వైద్యులు ఎప్పటికప్పుడు అందిస్తున్న సలహాలు, సూచనలను పాటించి ఆరోగ్యంగా ఉండాలని శర్వానంద్ కోరారు. ఆ తర్వాత కరోనా వైరస్ నుంచి మనల్ని మనం కాపాడుకోవడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ట్వీట్ చేశారు. ‘‘మన ప్రజల కోసం, దేశం కోసం, ప్రపంచం కోసం మీరు ఒక మహానుభావుడు’’ కావాలి అని తన సినిమాను గుర్తు చేస్తూ జాగ్రత్త చెప్పారు. ఆసక్తికరమైన ఇలస్ట్రేషన్ ఇమేజ్లు తన ట్వీట్లో పొందుపరిచారు.
Comments
Post a Comment