వెల్లువెత్తుతున్న విరాళాలు: అశ్వినీదత్ 20 లక్షలు.. సుధీర్ బాబు రూ.2 లక్షలు

కరోనా వైరస్ బాధితుల సహాయార్థం అలానే కరోనా నివారణకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకుంటున్న నివారణ చర్యలకు తమ వంతుగా తెలుగు సినిమా ఇండస్ట్రీ నుంచి ఒక్కొక్కరుగా భారీ విరాళాలు అందిస్తున్నారు. హీరో నితిన్తో ప్రారంభమైన ఈ విరాళాల వెల్లువ కొనసాగుతూనే ఉంది. కోవిడ్-19 వ్యాప్తి నిరోధం కోసం ప్రముఖ నిర్మాత, వైజయంతీ మూవీస్ అధినేత సి. అశ్వినీదత్ రూ. 20 లక్షలు విరాళం ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ. 10 లక్షలు, తెలంగాణ ముఖ్యమంత్రి సహాయనిధికి రూ. 10 లక్షలు అందజేస్తున్నట్లు తెలిపారు. కరోనా వ్యాప్తి నిరోధం విషయంలో రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు అహర్నిశలూ కృషి చేస్తున్నాయని ప్రశంసించిన అశ్వినీదత్.. ప్రభుత్వాల సలహాలు, సూచనలు ప్రజలందరూ తప్పకుండా పాటించాలని కోరారు. కుటుంబాలను పక్కనపెట్టి మరీ పోలీసులు, వైద్య సిబ్బంది అలుపనేది లేకుండా ప్రజలకు సేవ చేస్తున్నారని కొనియాడారు. వాళ్ల శ్రమ వృథా కాకుండా ఉండాలంటే.. ఈ విపత్కర పరిస్థితిని సమష్టిగా ఎదుర్కోవాలని, అందరూ ఇళ్లల్లోనే సురక్షితంగా ఉండాలని ఆయన విజ్ఞప్తి చేశారు. మరోవైపు హీరో సుధీర్ బాబు కూడా విరాళం ప్రకటించారు. 2 లక్షల రూపాయల విరళాన్ని ప్రకటించారు. ఈ మొత్తంలో లక్ష రూపాయలు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సహాయ నిధికి.. మరో లక్ష రూపాయలు తెలంగాణ సీఎం రిలీఫ్ ఫండ్కి అందించనున్నట్లు సుధీర్ బాబు తెలిపారు. దేశ ప్రధాని పిలుపు మేరకు 21 రోజులు లాక్ డౌన్కి తన సంపూర్ణ మద్దతు తెలిపిన సుధీర్ బాబు.. ఇంటి దగ్గర ఉంటూనే ఫిటనెస్ని ఎలా మెయింటైన్ చేయాలో సోషల్ మీడియా ద్వారా వీడియోలు చేసి విడుదల చేశారు. అలానే తన అభిమానులకు, ప్రజలకు హెల్తీ టిప్స్ ఇస్తున్నారు సుధీర్ బాబు. ఈ సందర్భంగా సుధీర్ బాబు మాట్లాడుతూ.. ‘‘ఇలాంటి విపత్కర పరిస్థితుల్ని సైతం లెక్క చేయకుండా మనకోసం పని చేస్తున్న ఎందరో డాక్టర్స్, పోలీస్ అధికారులు, మున్సిపల్ అధికారులు తదితరులకు కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఈ మహమ్మారిని ఎదుర్కోవాలంటే బయటకు రాకుండా ఇంటిలో ఉండటమే అన్ని విధాల సురిక్షితం. ఇలాంటి భయంకరమైన వ్యాధి నివారణకు ప్రభుత్వం తీసుకుంటున్న నివారణ చర్యలకు మనందరం సహకరించాలని తన అభిమానులకు, తెలుగు రాష్ట్ర ప్రజలకు విజ్ఞప్తి చేశారు సుధీర్ బాబు.
Comments
Post a Comment