వేణుమాధవ్‌కు చిరంజీవి సహా ప్రముఖుల కన్నీటి నివాళి

హాస్యనటుడు వేణుమాధవ్ పార్థివదేహానికి సినీ ప్రముఖులు నివాళులర్పించారు. వేణుమాధవ్ పార్థివదేహాన్ని గురువారం మధ్యాహ్నం ఒంటి గంట ప్రాంతంలో ఫిల్మ్ ఛాంబర్‌కు తీసుకొచ్చారు. ఫిల్మ్ ఛాంబర్ ఆవరణలో టెంట్‌లు ఏర్పాటుచేసి వేణుమాధవ్ పార్థివదేహాన్ని ఉంచారు. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ ఏర్పాట్లు చేశారు. మెగాస్టార్ చిరంజీవి, తెలంగాణ సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సహా పలువురు వేణుమాధవ్‌కు నివాళులర్పించారు. నాగబాబు, రాజశేఖర్, జీవిత, మురళీ మోహన్, రాజీవ్ కనకాల, రఘుబాబు, ఎస్వీ కృష్ణారెడ్డి, కె.అచ్చిరెడ్డి, దర్శకుడు కరుణాకరన్, ఉదయభాను తదితర సినీ ప్రముఖులు వేణుమాధవ్ పార్థివదేహం వద్ద పూలు చల్లి నివాళులర్పించారు. అయితే, వేణుమాధవ్ మృతదేహాన్ని చూసి ఉదయభాను తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. కన్నీరు పెట్టుకున్నారు. ఉదయభానుతో కలిసి వేణుమాధవ్ ‘వన్స్ మోర్ ప్లీజ్’ కామెడీ షో చేసిన విషయం తెలిసిందే. వీరిద్దరి మధ్య మంచి స్నేహం ఉంది. Also Read: కాగా, సినీ ప్రముఖుల నివాళులర్పించిన అనంతరం వేణుమాధవ్ పార్థివదేహాన్ని మౌలాలిలోని లక్ష్మీనగర్ శ్మశాన వాటికకు తరలించారు. అక్కడ ఈ సాయంత్రం వేణుమాధవ్‌కు అంత్యక్రియలు నిర్వహిస్తారు. కాలేయ సంబంధిత వ్యాధితో గత కొంతకాలంగా బాధపడుతోన్న వేణుమాధవ్‌కు కిడ్నీ సమస్య కూడా రావడంతో ఈనెల 6న కుటుంబ సభ్యులు ఆయన్ని సికింద్రాబాద్‌లోని యశోద ఆస్పత్రిలో చేర్పించారు. అక్కడ చికిత్స పొందుతూ బుధవారం మధ్యాహ్నం వేణుమాధవ్ కన్నుమూశారు. అప్పటి నల్గొండ జిల్లా కోదాడలో 1968 సెప్టెంబర్ 28న జన్మించిన వేణుమాధవ్.. పదో తరగతి వరకు అక్కడి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో చదువుకున్నారు. అలాగే కోదాడలోని కేఆర్‌ఆర్‌ కళాశాలలో ఇంటర్‌, డిగ్రీ పూర్తి చేశారు. మిమిక్రీ చేయడాన్ని హాబీగా మార్చుకున్న వేణుమాధవ్‌ తోటి వారిని, సినీ నటుల డైలాగులను అనుకరించేవారు. తర్వాత ముంబయి నుంచి బొమ్మలను తెప్పించుకుని వెట్రిలాక్విజం సాధన చేశారు. స్కూళ్లూ, కాలేజీల్లో ప్రదర్శనలిచ్చేవారు. దీంతో ఆయనకు స్థానికంగా మంచి గుర్తింపు వచ్చింది. కోదాడ నుంచి మూడు దశాబ్దాల క్రితం సోదరులు విక్రమ్‌, గోపాలకృష్ణతో నగరానికి వచ్చిన వేణుమాధవ్‌ కాప్రా సర్కిల్‌ హెచ్‌బీ కాలనీలోని మంగాపురం కాలనీలో స్థిరపడ్డారు. ఇక్కడి నుంచే ఆయన అవకాశాలు వెతుక్కోవడం మొదలుపెట్టారు. టీడీపీ మహానాడు సభల్లో మిమిక్రీ చేయడం ద్వారా స్వర్గీయ నందమూరి తారక రామారావు కళ్లలో వేణుమాధవ్ పడ్డారు. ఆ తరవాత హిమాయత్‌నగర్‌లోని టీడీపీ ఆఫీసులో టెలిఫోన్‌ ఆపరేటర్‌గా పనిచేశారు. మరోవైపు మిమిక్రీ ప్రదర్శనలు కూడా ఇచ్చేవారు. అలా దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి కళ్లలో పడి సినిమా అవకాశం దక్కించుకున్నారు.


Comments

Popular posts from this blog

అభిమాని మరణంతో ఎమోషనల్.. ఎప్పటికీ గుర్తుండిపోతావ్.. విజయ్ కంటతడి

‘కె.జి.యఫ్’ నిర్మాత నుంచి మరో పాన్ ఇండియా మూవీ

Rakul Preet Singh: రకుల్‌ ప్రీత్‌ సింగ్‌కు ఆపరేషన్... ఆ భాగాన్ని మార్చుకున్న బ్యూటీ