శోకసంద్రంలో కృష్ణ.. మామ పరిస్థితిపై గల్లా జయదేవ్ భావోద్వేగం
ప్రముఖ దర్శకురాలు, సూపర్స్టార్ కృష్ణ సతీమణి, సీనియర్ నటి విజయనిర్మల (73) అంతిమ యాత్ర కొనసాగుతోంది. తొలుత నానక్రామ్గూడలోని స్వగృహం ఫిల్మ్ ఛాంబర్కు తరలించారు. అక్కడ కొద్దిసేపు ఉంచి చిలుకూరులోని విజయగార్డెన్స్కు తరలిస్తున్నారు. ఈ అంతిమ యాత్రలో సూపర్స్టార్ కృష్ణ, మహేశ్ బాబుతోపాటు ఎంపీ , అరుణకుమారి, పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు పాల్గొన్నారు. అలాగే వేలాది మంది అభిమానులు కూడా తమ అభిమాన నటిని కడసారి చూసేందుకు తరలివచ్చారు. దీంతో నానక్రామ్గూడ, ఖాజాగూడలో భారీగా ట్రాఫిక్ జాం అయ్యింది. రంగంలోకి దిగిన పోలీసులు ట్రాఫిక్ను క్లియర్ చేస్తున్నారు. మరికాసేపట్లో చిలుకూరులోని విజయకృష్ణ గార్డెన్స్లో విజయనిర్మల అంత్యక్రియలు జరగనున్నాయి. ఇప్పటికే దహన సంస్కారాలకు అన్ని ఏర్పాట్లు చేశారు. కన్నడ నటుడు ఉపేంద్ర సైతం అంతిమ యాత్రలో నరేశ్ వెంట ఉన్నారు. మెయినాబాద్లో అంత్యక్రియల ఏర్పాట్లను గల్లా జయదేవ్, ఆయన తల్లి అరుణకుమారి స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. ఈ సందర్భంగా గల్లా జయదేవ్ మీడియాతో మాట్లాడుతూ... 50 ఏళ్లపాటు సహధర్మచారిణిగా ఉండి, కష్ట సుఖాల్లో తోడున్న విజయనిర్మల మరణం అందరికన్నా కృష్ణ గారికి తీరని లోటన్నారు. ఆయన బాధను తొలగించి, తిరిగి మామూలు మనిషిని చేయడం ఎలాగో తమకు తెలియడం లేదని ఆయన అల్లుడు, ఎంపీ గల్లా జయదేవ్ వ్యాఖ్యానించారు. 1992లో తన వివాహమైన తరువాత, విజయనిర్మల గారి గొప్పతనాన్ని గురించి తెలుసుకున్నానని అన్నారు. ఆమె మరణ వార్త విని తాను దిగ్భ్రాంతికి గురయ్యానని అన్నారు. కృష్ణ, విజయనిర్మలలు కలిసి కష్టాలను, సుఖాలను పంచుకున్నారని, ఆమె ఓ డేరింగ్ మహిళని, ఎన్ని కష్టాలు ఎదురైనా నిబ్బరంగా ఉండేవారని గుర్తు చేసుకున్నారు.
Comments
Post a Comment