విజయ నిర్మలకు నివాళులు అర్పించిన చిరంజీవి.. కృష్ణ, నరేష్లను ఓదార్చిన మెగాస్టార్
ప్రముఖ నటి, దర్శకురాలు భౌతిక కాయానికి మెగాస్టార్ నివాళులు అర్పించారు. గురువారం సాయంత్రం నానక్ రామ్ గూడలోని కృష్ణ నివాసానికి వెళ్లిన ఆయన.. విజయ నిర్మల పార్థీవ దేహం వద్ద అంజలి ఘటించారు. అనంతరం కృష్ణ, నరేష్లను ఆయన పరిమర్శించారు. జీవిత, రాజశేఖర్ దంపతులు కూడా విజయ నిర్మల భౌతిక కాయానికి నివాళులు అర్పించారు. విషాద వదనంతో ఉన్న కృష్ణను జీవిత ఓదార్చారు. అంతకు ముందే విజయ నిర్మల మృతి పట్ల సంతాపం వ్యక్తం చేస్తూ మెగాస్టార్ మీడియాకు ప్రకటన విడుదల చేశారు. అరుదైన దర్శక నటీమణి విజయనిర్మల హఠాన్మరణం తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందన్నారు. తెలుగు పరిశ్రమలో భానుమతి తర్వాత గర్వించదగిన బహుముఖ ప్రజ్ఞాశాలి విజయనిర్మల.. ఆమె నటనతో ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్రవేశారని చిరంజీవి తెలిపారు. బాలనటిగా, కథానాయికగా, దర్శకురాలిగా, నిర్మాతగా తన ప్రతిభాపాటవాలను విజయనిర్మల చాటారన్నారు. అంతటి ప్రతిభావంతురాలిని మనం ఇప్పట్లో ఇంకెవరినీ చూడలేమని చిరంజీవి తన సంతాప సందేశంలో పేర్కొన్నారు.
Comments
Post a Comment