అశ్రునయనాల మధ్య విజయ నిర్మలకు తుది వీడ్కోలు.. బోరున విలపించిన కృష్ణ
బహుముఖ ప్రజ్ఞాశాలి, ప్రపంచ సినీ చరిత్రలో ఏ మహిళా దర్శకురాలికి సాధ్యంకాని అరుదైన గుర్తింపు పొందిన విజయ నిర్మలకు ఆశ్రునయనాల మధ్య అంత్యక్రియలు ముగిశాయి. తొలుత నానక్రామ్ గూడలోని ఆమె ఇంటి నుంచి పార్థీవదేహాన్ని ఫిల్మ్ ఛాంబర్కు, అక్కడ కాసేపు ఉంచి మెయినాబాద్ మండలం చిలుకూరు సమీపంలో వారి ఫామ్హౌస్కు తరలించారు. అక్కడ హిందూ సంప్రదాయం ప్రకారం దహన సంస్కారాలు పూర్తిచేశారు. అభిమాన నటి కడసారి చూపుకోసం అభిమానులు, ప్రజలు భారీగా తలివచ్చారు. మరణంతో ఆమె భర్త కృష్ణ కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఆయనను ఓదార్చడం ఎవరితరం కావడంలేదు. చివరిసారిగా విజయ నిర్మల పార్ధీవదేహాన్ని చూసి కృష్ణ బోరున విలపించారు. ఈ సమయంలో ఆయన పరిస్థితి చూసినవారందరూ కంటతడి పెట్టుకున్నారు. శాస్త్రోక్తంగా అన్నింటి పూర్తిచేసి కుమారుడు నరేశ్ ఆమె చితికి నిప్పంటించారు. నటిగా, దర్శకురాలిగానే కాదు, కుటుంబ పెద్దగానూ తనదైన ముద్రవేశారు. అప్పట్లో సినిమా షూటింగ్లతో కృష్ణ బీజీగా ఉంటే కుటుంబాన్ని ఆమె చూసుకున్నారు. బాలనటిగా సినీ ప్రస్థానం ప్రారంభించి కథానాయికగా, దర్శకరాలిగా, నిర్మాతగా తన మార్క్ చూపారు. అంతకు ముందు మెయినాబాద్లో అంత్యక్రియల ఏర్పాట్లను గల్లా జయదేవ్, ఆయన తల్లి అరుణకుమారి స్వయంగా పర్యవేక్షించారు. ఈ సందర్భంగా గల్లా జయదేవ్ మీడియాతో మాట్లాడుతూ... 50 ఏళ్లపాటు సహధర్మచారిణిగా ఉండి, కష్ట సుఖాల్లో తోడున్న విజయనిర్మల మరణం అందరికన్నా కృష్ణ గారికి తీరని లోటని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన బాధను తొలగించి, తిరిగి మామూలు మనిషిని చేయడం ఎలాగో తమకు తెలియడం లేదని.. 1992లో తన వివాహమైన తరువాత, విజయనిర్మల గారి గొప్పతనాన్ని గురించి తెలుసుకున్నానని అన్నారు.
Comments
Post a Comment